Sunday, May 4, 2025

Creating liberating content

తాజా వార్తలుఅధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా

అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా

మోదీ పుణ్యక్షేత్రంలో నిలబడి మాట తప్పారు: తిరుపతి సభలో షర్మిల
తిరుపతిలో కాంగ్రెస్ ప్రత్యేక హోదా డిక్లరేషన్ సభ
హాజరైన షర్మిల, సచిన్ పైలెట్, సీపీఐ నారాయణ, సీపీఎం శ్రీనివాసరావు

తిరుపతిలో కాంగ్రెస్ న్యాయ సాధన సభ నిర్వహించారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అధ్యక్షతన జరిగిన ఈ సభకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ చింతా మోహన్ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ వర్గాలు సభను ప్రత్యేక హోదా డిక్లరేషన్ సభగా అభివర్ణించాయి. ఈ సభలో షర్మిల ప్రసంగిస్తూ… 2014లో ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతిలోని ఇదే మైదానానికి వచ్చారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాడు తిరుపతి ప్రజల సాక్షిగా మోదీ హామీ ఇచ్చారని వెల్లడించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తుందని.. రాహుల్‌ గాంధీ పీఎం అయ్యాక తొలి సంతకం దీనిపైనే చేస్తారని షర్మిల వెల్లడించారు.అద్భుతమైన రాజధాని కడతామన్నారు. రాష్ట్రాన్ని హార్డ్‌వేర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. వాటిలో ఒక్క‌టైనా నిల‌బెట్టుకున్నారా ? అని ప్ర‌శ్నించారు శ‌ర్మిల‌. పదేళ్లుగా కేంద్రం రాష్ట్రాన్ని మోసం చేస్తోందని దుయ్యబట్టారు. పొరుగు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో మెట్రో రైలు లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఏపీ మాత్రమేనని షర్మిల వివరించారు.”రాజకీయాల కోసం, ఓట్ల కోసం, ఆంధ్ర ప్రజల మెప్పు కోసం పదేళ్లు ప్రత్యేక హోదా అని అప్పటి బీజేపీ నాయకుడు, ఇప్పటి ప్రధానమంత్రి మోదీ ఇదే మైదానంలో వాగ్దానం చేశాడు. ఆనాటి సభలో మోదీ ఎన్ని మాటలు చెప్పాడు. ఆంధ్ర ప్రజల బాధ నాకు అర్థమవుతోందని అన్నాడు, ఆంధ్ర ప్రజల వేదన నాకు అర్థమవుతోందని అన్నాడు. మీకు భరోసా ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాను అన్నాడు, ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానన్నాడు, దేశంలోని ఇతర నగరాలకు దీటైన రాజధాని నిర్మిస్తామని అన్నాడు. పెట్రో వర్సిటీ అన్నాడు… ఒక్కటైనా నెరవేరిందా? గత టీడీపీ ప్రభుత్వం, ఇప్పటి జగనన్న ప్రభుత్వం ఒక్క హక్కునైనా సాధించారా? ఈ పదేళ్లలో ఒక్కటైనా సాధించుకున్నామా? అటు అధికార పక్షం, ఇటు విపక్షం రెండు కూడా బీజేపీతో కుమ్మక్కయ్యాయి. రామభక్తుడ్ని అని చెప్పుకునే మోదీ మూడు నామాల వానికి పంగనామాలు పెట్టాడు. పుణ్యక్షేత్రంలో నిలబడి మాట తప్పాడు . మీరు ఎంతగానో నమ్ముతారని చెప్పే దేవుడ్ని కూడా మోసం చేసిన మిమ్మల్ని ఏమనాలి? మోదీని కేడీ అనక ఇంకేమనాలి? పదేళ్లు ప్రత్యేక హోదా అని చెప్పి, పదేళ్లయినా ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఉన్నందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీ ప్రజలకు ఏం సమాధానం చెబుతుంది?” అంటూ షర్మిల నిప్పులు చెరిగారు.కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రత్యేక హోదా అనేది రాష్ట్ర ప్రజల హక్కు. పునర్ విభజన చట్టంలో ఉన్న ప్రతి అంశం ఏపీ ప్రజల హక్కు. అద్భుతమైన రాజధాని నిర్మాణం, పోలవరం, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు, విశాఖ నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్, ఉత్తరాంధ్ర, రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. ఇన్ని హక్కులు మనం కలిగి ఉన్నప్పటికీ, ఒక్కటైనా మనకు లభిస్తుందా అనేది ప్రజలు ఆలోచించాలి. సభలో పాల్గొన్న కాంగ్రెస్ యువనేత సచిన్ పైలట్.. ఇదే తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని మోడీ ప్రమాణం చేశారని సచిన్ పైలట్ గుర్తుచేశారు. మోడీ అధికారంలోకి వచ్చి పదేళ్లు పూర్తి చేసుకున్నా ఆయన ఇచ్చిన హామీ అమలు చేయలేదన్నారు. రాష్ట్రాన్ని పాలించిన తెలుగుదేశం, వైసీపీ కూడా ఆ దిశగా మోడీపై ఒత్తిడి తీసుకురాలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇచ్చి చూస్తే… ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నీ అమలు చేసి చూపుతామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article