తాజా వార్తలు50 ఏళ్ల తర్వాత తొలిసారి చంద్రుడిపై అడుగుపెట్టిన లూనార్ ల్యాండర్ ‘ఒడిస్సియస్’

50 ఏళ్ల తర్వాత తొలిసారి చంద్రుడిపై అడుగుపెట్టిన లూనార్ ల్యాండర్ ‘ఒడిస్సియస్’

అగ్రరాజ్యం అమెరికా దాదాపు 50 ఏళ్ల తర్వాత తొలిసారి చంద్రుడిపై మరోసారి అడుగుపెట్టింది. అమెరికా కంపెనీ ‘ఇంటూటివ్ మెషీన్స్‌’కు చెందిన తొలి లూనార్ ల్యాండర్ ‘ఒడిస్సియస్’ చంద్రునిపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో యాబై ఏళ్ల తర్వాత చంద్రుడి ఉపరితలంపై దిగిన అమెరికా తొలి అంతరిక్ష నౌకగా రికార్డు సృష్టించింది. ల్యాండర్ ఒడిస్సియస్ అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 6:23 గంటల సమయంలో చంద్రుడి దక్షిణ ధృవంపై దిగింది. నాసా, ఇతర కమర్షియల్ కంపెనీలకు చెందిన పరికరాలను ఒడిస్సియస్ చంద్రుడిపైకి మోసుకెళ్లింది. కాగా అమెరికాకు చెందిన చివరి మూన్ ల్యాండింగ్ మిషన్ 1972 డిసెంబర్‌లో జరిగింది. అపోలో మిషన్‌లో భాగంగా ‘అపోలో-17’ అంతరిక్ష నౌక చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయ్యిన విషయం తెలిసిందే. చంద్రుడి ఉపరితల పరస్పర చర్యలు, వాతావరణ చర్యలు, రేడియో ఖగోళ శాస్త్రానికి సంబంధించిన పరిశోధనలు ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ల్యాండింగ్ టెక్నాలజీ, కమ్యూనికేషన్, నావిగేషన్‌కు సంబంధించిన సామర్థ్యాలపై కూడా పరిశీలనలు చేయనున్నట్టు నాసా రిపోర్టులు చెబుతున్నాయి. కాగా చంద్రుడిపై పరిశోధనల కోసం పలు అమెరికా కంపెనీలతో నాసా కలిసి పనిచేస్తోంది.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article