లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
5వ విడతగా కడప జిల్లాలో 530 జంటలకు రూ.4.32 కోట్లు మంజూరు
కడప బ్యూరో
వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకం.. పేదింటి ఆడపిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే అపురూపమైన ఆర్థిక పెన్నిధి.. అని జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ కళ్యాణ మస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకం 5వ విడత ఆర్థిక సాయాన్ని.. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయం నుండి మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా బటన్ నొక్కి.. లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు.
ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ వీసి హాలు నుండి కడప జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజుతో పాటు.. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, డిఆర్వో గంగాధర్ గౌడ్, డిఆర్డీఏ పీడి ఆనంద్ నాయక్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతిలు హాజరయ్యారు.
ముఖ్యమంత్రి విసి ముగిసిన అనంతరం.. ఈ పథకానికి సంబంధించి వైఎస్ఆర్ జిల్లాలో వివాహం చేసుకున్న అర్హులైన 530 జంటలకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 4,32,35,000 లను మెగా చెక్కు రూపంలో జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు అతిధులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు, చదువును ప్రోత్సహించడం కోసం పదో తరగతి నిబంధనను అమలు చేస్తూ.. ఆడపిల్లల బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఏడాదిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ పథకానికి సంబంధించి అర్హులను ఎంపిక చేసి.. లబ్ధిదారులకు కళ్యాణమస్తు, షాదీ తోఫాలను పెళ్లినకుమార్తె తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు.
అరులైన వారు పెళ్లి అయిన 60 రోజుల్లోపు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనంతరం అధికారులు దరఖాస్తులను పరిశీలించి.. క్షేత్రస్థాయిలోనూ విచారించి అర్హుల జాబితాను ప్రకటిస్తారన్నారు. అలాగే, రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పి. రామసుబ్బా రెడ్డి, డి ఆర్ ఓ గంగాధర్ గౌడ్, సాంఘిక సంక్షేమ శాఖ, డీఆర్డీఏ, మెప్మా, వివిధ సంక్షేమ శాఖల అధికారులు, లబ్ది పొందిన వధూవరులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.