పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఐల నుంచి హోంగార్డుల దాకా మొత్తం 85 మందిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వారందరినీ సిటీ ఆర్మ్ డ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని సూచించారు. వారి స్థానంలో ప్రస్తుతం 82 మందిని నియమించారు. పంజాగుట్ట పీఎస్ లో సిబ్బంది మొత్తాన్ని ఒకేరోజు బదిలీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
హైదరాబాద్ సిటీలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన పరిణామాలపై విమర్శలు వచ్చాయి.కీలకమైన విషయాలు బయటకు చేరవేస్తున్నారనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కేసుల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు రావడం, మాజీ ఎమ్మెల్యే కొడుకు యాక్సిడెంట్ విషయంలో చోటుచేసుకున్న పరిణామాలపై విమర్శలు వ్యక్తం కావడంపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే పోలీస్ స్టేషన్ నుంచి 85 మంది సిబ్బందిని బదిలీ చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటి సారి అని అధికార వర్గాలు తెలిపాయి

