తమిళనాడులోని ధర్మపురి జిల్లా తొప్పూర్ ఘాట్రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వరుసగా నాలుగు వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి.
తొలుత ఓ ట్రక్కు మరో ట్రక్కుపైకి దూసుకెళ్లింది. దీంతో ట్రక్కు బ్రిడ్జిపై నుంచి కిందపడింది. ఈ క్రమంలో ఆ రెండింటి మధ్య చిక్కుకుని ఓ కారు నుజ్జునుజ్జు అయింది. వెనకనుంచి వస్తున్న మరికొన్ని వాహనాలు నియంత్రించుకోలేక అవి కూడా వాహనాలను ఢీకొట్టి బ్రిడ్జి నుంచి కిందపడ్డాయి. ప్రమాదం తర్వాత ఓ ట్రక్కులో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.ప్రమాదవార్త అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.