అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు ఇవాళ్టితో 1500 రోజులు పూర్తి చేసుకోనున్నాయి. 2019 డిసెంబర్ 17న సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను వచ్చినప్పట్నుంచి రైతులు ఆందోళన బాటపట్టారు. ఇవాళ ఉద్యమం 1500వ రోజుకు చేరుకుంటున్న నేపథ్యంలో అమరావతి సమర శంఖారావం పేరుతో 29 గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వెలగపూడి, మందడంలో రెండు సభలను ఏర్పాటు చేశారు.వెలగపూడిలో ఐకాస నేత పువ్వాడ సుధాకర్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ఇవాళ సమర శంఖం పూరిస్తామన్నారు. గత 1500 రోజులుగా పోరాడుతున్న రైతులు రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా రాజకీయ నిర్ణయం తీసుకుని జగన్ను ఓడిస్తారన్నారు. మహిళా రైతులు మాట్లాడుతూ అమరావతికి భూములిచ్చిన రైతులను ఇబ్బందులు పెట్టిన జగన్.. రాబోయే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.