అమరావతి:వైసీపీకి కి నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు మంగళవారం రాజీనామా చేశారు.ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ..వైఎస్ఆర్సీపీకి, నరసరావుపేట ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా లావు ప్రకటించారు.
నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలును నరసరావుపేట నుండి కాకుండా గుంటూరు నుండి పోటీ చేయాలని పార్టీ నాయకత్వం కోరింది. అయితే నరసరావుపేట నుండే పోటీ చేసేందుకు లావు కృష్ణదేవరాయలు ఆసక్తిగా ఉన్నారు. కానీ, గుంటూరు నుండి లావు కృష్ణ దేవరాయలు పోటీ చేయాలని పార్టీ నాయకత్వం కోరుతుందనే ప్రచారం సాగుతుంది.అయితే ఈ విషయమై తన అభిప్రాయాన్ని లావు కృష్ణ దేవరాయలు పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. నరసరావుపేట పార్లమెంట్ స్థానంలో తాను చేయాల్సిన పనులు ఇంకా మిగిలి ఉన్నాయని ఆయన చెబుతున్నారు.ఈ దఫా వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పార్టీ నాయకత్వానికి చెబుతున్నారు.
గత నాలుగున్నరేళ్లలో నియోజకవర్గానికి ఎంతో సేవ చేశానని తెలిపారు. అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని పార్టీ నాయకత్వం భావిస్తోందని చెప్పారు. దీని వల్ల అందరూ కన్ఫ్యూజన్ కు గురవుతున్నారని తెలిపారు. దీనికి తెరదించుతూ.. తాను ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశానని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ తనను ప్రోత్సహించి ఎంపీ టికెట్ ఇచ్చారని… ఆయన ఆకాంక్షల మేరకు తాను పార్టీని ఉన్నత స్థాయిలో ఉంచానని తెలిపారు. ఎంపీ అంటే ఎప్పుడో మూడు నెలలకు ఒకసారి కనిపిస్తాడనే భావనను తాను తొలగించానని… ప్రజల్లోనే ఉంటూ వారికి అన్ని విధాలా అండగా ఉన్నానని తెలిపారు.
పార్టీలో గత 15, 20 రోజులుగా అనిశ్చితి నెలకొందని చెప్పారు. అనిశ్చితికి తెర పడాలనే ఉద్దేశంతోనే రాజీనామా చేశానని చెప్పారు. అనిశ్చితికి తాను కారణం కాదని, ఈ అనిశ్చితిని తాను కోరుకోలేదని అన్నారు. ఈ అనిశ్చితి వల్ల తనకు కానీ, పార్టీకి కానీ ఉపయోగం లేదని చెప్పారు. క్యాడర్ కూడా ఏ డైరెక్షన్ లో వెళ్లాలనే గందరగోళంలో ఉన్నారని తెలిపారు. దీనికి పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉందని చెప్పారు. పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే తాను రాజీనామా చేశానని చెప్పారు.