న్యూఢిల్లీ: అయోధ్య శ్రీరామ మందిరం నిర్మాణ విషయంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) ఘాటుగా స్పందించింది. త్వరలో అసదుద్దీన్ కూడా రామనామం జపిస్తారని వ్యాఖ్యానించింది.
కర్ణాటక పర్యటనలో ఉన్న అసదుద్దీన్ ఒవైసీ శనివారం పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదును ఓ పద్ధతి ప్రకారం ముస్లింలకు దూరం చేశారని … 1992లో మసీదును కూలగొట్టి ఉండకపోతే ముస్లింలు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేవారు కాదని అన్నారు. ‘500 ఏళ్ల పాటు బాబ్రీ మసీదులో ముస్లింలు నమాజ్ చేశారు. కాంగ్రెస్ నేత జీబీ పంత్ సీఎంగా ఉన్న కాలంలో మసీదులో విగ్రహాలు పెట్టారు. ఆ తరువాత సీఎం మసీదును మూసేశారు. అనంతరం, అక్కడ పూజలు ప్రారంభమయ్యాయి. వీహెచ్పీ ఏర్పాటైన కాలంలో అక్కడ రామమందిరం లేనేలేదు’ అని అసదుద్దీన్ ఒవైసీ చెప్పుకొచ్చారు. కాగా, ఒవైసీ వ్యాఖ్యలపై వీహెచ్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘గత 500 సంవత్సరాల్లో మీ పూర్వీకులెవరైనా అయోధ్యను సందర్శించారా? ఒవైసీ యూకేలో బారిస్టర్ చేశారు. మరి, మసీదును రక్షించుకునేందుకు ఆయన కోర్టును ఎందుకు ఆశ్రయించలేదు? ఈ ముస్లిం పార్టీ అర్థం చేసుకోవాల్సిందేంటంటే త్వరలో వీరూ రామ భక్తులుగా మారతారు. రామనామం జపిస్తారు’ అని వీహెచ్పీ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ వ్యాఖ్యానించారు. ఒవైసీ వ్యాఖ్యలు ముమ్మాటికీ రాజకీయమేనని ఆయన స్పష్టం చేశారు. ఒవైసీ త్వరలో రామ భక్తులుగా మారుతారని, ఆయన రామ నామ స్మరణ చేస్తారన్నారు.