*తెలంగాణ కోసం తల్లడిల్లిన తల్లిని ఏమార్చారు….
*నా తెలంగాణా అని నడి వీధుల్లోకి వచ్చింది…
*నేడు నా మరణం ఆసన్నమైంది అంటోంది..
*నాకెవ్వరూ న్యాయం చేయలేదని నలిగిపోయింది…కుమిలిపోతుంది…
*నా మరణాన్ని నేటి రాజకీయాల కోసం వాడద్దని అంటూ…
*నేను నిరామయంలో వెళ్లే పరిస్థితి లేదంది..
*నా త్యాగం నిలువెళ్ల గాయలని నింపిందని …
*బ్రతికి ఉన్నప్పుడు పరామర్శ లేదు…
*చచ్చాక చావును వాడుకోవద్దని హితవు పలుకుతూ…
*ఇదే చివరి అక్షరాలంటూ ఆవేదన తో…
*మాజీ డీఎస్పీ నళిని లేఖ…
(రామమోహన్ రెడ్డి)
తెలంగాణ తల్లి కన్న బిడ్డల కోసం తన బిడ్డలను లెక్క చేయక ఎన్నో తిప్పలు పడి తనువు చాలించే స్థాయికి వచ్చింది ఓ తల్లి.నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డల కోసం నమ్మి అప్పగించిన ఉద్యోగం కూడా పక్కన బెట్టి న్యాయం కోసం నడి వీధుల్లో కి వచ్చింది ఓ నారీ శక్తి.నాటి ,నేటి రాజకీయ నాయకుల నయవంచన ఆలోచన చేయకుండా కష్ట పడి సాధించి తెచ్చుకున్న ఉద్యోగాన్ని నామ మాత్రం గా వదిలి నా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని అంటూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు నిద్రలేని రాత్రులు గడిపి నిలువెల్ల గాయాలపాలై నేడు ఆనాటి స్మృతులను గుర్తుచేసుకుని జ్ఞానం వైపు ఉన్నా గతం తాలూకు బాధ ఆవేదన,నయవంచన, నాటి పాలకుల స్వార్థం అన్ని ఆమె ఆనందమైన ,అందమైన జీవితాన్ని అవిరిచేసాయి.ఆమె కుటుంబానికి తీరని వ్యధను తెచ్చిపెట్టినా కూడా ఆధ్యాత్మిక వైపు అడుగులు వేసి యజ్ఞబ్రహ్మ అని తనకు తాను మార్పు చెంది ఈ రోజు మృత్యువుతో పోరాడుతూ మహా మృత్యంజయ మహా మంత్రాన్ని జపిస్తూ ఈ మానవ సమాజంలో ఉంది.ఆమె ఏవరో కాదు తెలంగాణ సమాజం కోసం పదవి త్యాగం చేసి పన్నెండు సంవత్సరాలైన ఆమె త్యాగ నిరతని పట్టించు కొని పాపానికి నా ప్రాణం పోబోతుందని ఫేస్బుక్ ద్వారా లేఖ విడుదల చేసిన తెలంగాణ మాజీడీఎస్పీ నళిని. ఆమె విడుదల చేసిన లేఖ సారాంశం పూర్తిగా…

చావు బతుకుల మధ్య డీఎస్పీ నళిని
ఒక అధికారిణిగా, ఉద్యమకారిణిగా, రాజకీయవేత్తగా,ఆయుర్వేద ఆరోగ్య సేవిక గా,ఆధ్యాత్మిక వేత్తగా సాగిన నా జీవితం ముగియబోతోంది.నాఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్ గా ఉంది.ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాను. మూడు(3)రోజుల నుండి నిద్ర లేదు.రాత్రంతా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నాను.
ఎనిమిది (8)ఏండ్ల క్రితం సోకిన Ruematoid arthritis అనే విలక్షణ కీళ్ల జబ్బు(= Blood cancer+ Bone Cancer) గత రెండు నెలలుగా టైపాయిడ్,డెంగ్యూ,చికెన్ గున్యా వైరస్ల వల్ల తీవ్ర స్థాయికి చేరింది.కనకణం పేలిపోతున్నట్లు,ఏ కీలుకా కీలు విరిచేసినట్లు నొప్పి.తట్టుకోలేక పోతున్నాను.

2018 లో ఈ జబ్బు ప్రారంభం అయినప్పుడు ఇలాంటి స్థితి యే ఏర్పడ్డపుడు,మొండి పట్టుదలతో ఏదో సాధించాలనే తపనతో హరిద్వార్ వెళ్ళి రాందేవ్ బాబా పంచకర్మ సెంటర్ లో నెలల తరబడి ఉంటూ నన్ను నేను బాగుచేసుకున్నాను.కానీ ఇప్పుడు నాకు అంత దూరం పోయేంత ఓపిక లేదు. నిరామయంలో చేరేంత డబ్బు లేదు.
25 ఏండ్ల క్రితమే నా శరీరం నాన్ స్టెరాయిడల్
యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కు సెన్సిటివ్ గా మారిపోయింది.
నేను ఫార్మసిస్టు ను కూడా. కాబట్టి అలోపతి మందులకు ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో నాకు బాగా తెలుసు.కనుక 30 లోపు ఉండాల్సిన RA ఫ్యాక్టర్ అత్యధికంగా 900 కు చేరినా స్టెరాయిడ్స్ వాడకుండా ఆయుర్వేదమే వాడుతూ, యోగ,ధ్యానం,వేదాధ్యయనం, యజ్ఞముల ద్వారా మామూలు మనిషిగా మీ అందరి ముందు కనిపించాను.కానీ గత కొన్ని నెలలుగా మళ్ళీ నాలో స్ట్రెస్ పెరుగుతూ వస్తుంది.దాని ప్రభావమే రకరకాల ఆరోగ్య రుగ్మతలు చుట్టుముట్టాయి. ఇంగ్లీష్ మందులను వాడక తప్పని పరిస్థితి.వాటి సైడ్ ఎఫెక్ట్స్ నా పరిస్థితిని ప్రమాద స్థాయి కి చేర్చాయి.
నా గతమంతా వ్యధ భరితం
తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల నా నిలువెల్లా గాయాలే అయ్యాయి.రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పన్నిన పద్మవ్యూహం లోంచి బయట పడితే, డిపార్ట్మెంట్ నా వెన్నులో సస్పెన్షన్ అనే బల్లాన్ని కసితీరా దింపింది.సహాయం చేసేవాడు కనిపించక,నొప్పిని భరిస్తూనే 12 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని అనుభవించాను.మహర్షి దయానందుని దయవల్ల ఒక చక్కని ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొని,అందులో విశేషమైన కృషి చేస్తూ,యజ్ఞ బ్రహ్మగా VYPS ( వేద యజ్ఞ పరిరక్షణ సమితి)సంస్థాపకురాలుగా ఎదిగి,హిందీ అభిమానులను కూడా సంపాదించుకొని,నా దారిని రహదారిగా పూల బాటగా మలచుకున్నాను. నళిని మళ్ళీ వికసించింది.

ఇలాంటి తరుణంలో నేటి CM అధికారంలోకి రాగానే నా ఫైల్ ను ఎందుకో తెరిచారు.నాకేదో సహాయం చేస్తానని ప్రకటన చేశారు.వారిని కలిసి నా మనసులో మాట చెప్పాను. సస్పెన్షన్ పై విచారణ చేయించి ఇన్నెండ్లు
ఇవ్వకుండా ఎగ్గొట్టిన సబ్సిస్టెన్స్ అల్లోవెన్స్ లెక్క
కట్టి( సుమారు 2 కోట్లు) ఇవ్వండి అని అడుగుతూ 16 పేజీల స్వీయ లిఖిత రిపోర్ట్ ను ఇచ్చాను.వీలైతే వేద విద్యా కేంద్ర స్థాపనకు గ్రాంట్ కూడా ఇమ్మని అడిగాను.( రెండోది వారి పార్టీ పాలసీ కి విరుద్ధం. నేను హిందూ కాకపోయి ఉంటే వెంటనే గ్రాంట్ శాంక్షన్ అయి ఉండేది).6 నెలల తర్వాత నా పిటిషన్ పొజిషన్ కనుక్కుంటే చెత్త బుట్ట పాలైంది అని తెలిసింది.నా ఆఫీస్ కాపీ ని మళ్ళీ స్కాన్ చేసి పంపాను. దానిపై ఇప్పటి వరకు స్పందన లేదు.
మీడియా మిత్రులకు విజ్ఞప్తి
నేను చస్తే ఎవరూ సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయకండి.రిజైన్డ్ ఆఫీసర్,కవయిత్రి ,యజ్ఞ బ్రహ్మ అని నన్ను సంభోదించండి. నా శరీరానికి జరగాల్సిన అంతిమ సంస్కారం వైదికంగా జరగాలి. బ్రతుకుండగా నన్ను తెలంగాణ పోరాట విషయంలో ఏ నాయకుడు సన్మానించలేదు. నేను చనిపోయాక అంటే పోస్టుమస్ అవార్డులు, రివార్డులు ఇవ్వడానికి బయలుదేరే రాష్ట్ర నాయకులకు ఒక వినతి.బ్రతుకుండగా నన్ను పట్టించుకొని మీరు రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడుకోవద్దు.
ఒకవేళ నా ఈ ప్రస్తుత దయనీయ స్థితి మీలో ఎవరో ఒకరి ద్వారా కేంద్ర ప్రభుత్వ దృష్టికి చేరితే,నాకు సరైన, ఖరీదైన వైద్యం అందితే నేను ప్రాణాపాయ స్థితి నుండి బయట పడతాను. లేదంటే …జ వీఐపీ యజ్ఞాలు పూర్తి చేయాలని,ఆధ్యాత్మిక కేంద్రం స్థాపించి విద్యార్థులకు శిబిరాలు నిర్వహించి సనాతన ధర్మాన్ని బోధించి వారిని ధర్మ పరిరక్షకులుగా తీర్చిదిద్దాలని, మోక్ష సాధన తీవ్రతరం
చేయాలని … ఇలాంటి నా కోరికలు ఈ జన్మలో తీరేలా లేవు.
నా పేరు పై ఉన్న ఒక్కగానొక్క ఇంటి స్థలం vyps కు చెందుతుంది.బ్రతుకుండగా దేశ ప్రధాని ని కలవలేక పోయాను.వారు కరుణామయులు.నా మరణానంతరం వారు నా లక్ష్య సాధన కోసం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మా వేదామృతం ట్రస్ట్ కు ఇవ్వవలసిందిగా మనవి.నా జీవితపు అంతిమ లక్ష్యమైన మోక్ష సాధనను మళ్ళీ జన్మలో కొనసాగిస్తాను.
నా మనోభావాలను పంచుకొనే చక్కని మాధ్యమంగా పనిచేస్తున్న ఫేస్బుక్ కు ధన్యవాదాలు.
*సెలవిక మిత్రులారా *
అంటూ ఆమె లేఖ విడుదల చేసింది. సారీ ఆమె ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది.
దీనిని బట్టి చూస్తే తెలంగాణ తల్లి తల్లడిల్లి పోతుందేమో అన్న సందేహం కలిగిన తప్పేమి కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఓ మహిళ ఉద్యోగంలో రానించాలని ఎన్నో కలలు కని ఆ కల సాకారం చేసుకున్నాక ఆనాటి పరిస్థితుల ప్రభావం ఆమె ఆలోచన విధానం, అప్పటి ఆమె ఆవేదన కొట్లాది మంది కోసం కొట్లాడితే ఉద్యోగం నుండి సస్పెండ్ చేస్తే ఆ సస్పెండ్ ఆమె జీవితాన్ని అయోమయం చేసిందే తప్ప ఆమె అనుకున్నది నెరవేరింది కానీ ఆమె ఆశయం ఆమె అంప సయ్యపైకి చేర్చుతుందని అనుకోలేదు. ఆమె అనుకోకుండానే అతి భయంకరమైన కోలుకోలేని ప్రమాదం లోకి నెత్తివేయబడింది. ఆమె గతం,వర్తమానం, భవిష్యత్ భావితరాలకు భావోద్వేగ సందేశాన్ని ఇస్తుందని ఆశించి ఆమె మనో నిబ్బరంతో మృత్యువును జయించాలని కోరుకొంటుంది ఆధ్యాత్మిక లోకం.

