గొల్లప్రోలు : రక్తదానం చేయడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని ఆదర్స్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ బుర్రా అనుబాబు అన్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఎన్ఎస్ఎస్, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ రక్తదాన శిబిరాన్ని కళాశాల చైర్మన్ బుర్రా అనుబాబు, కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ అనురాధ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు స్వచ్చందంగా రక్తదానం చేయడం అభినందనీయమని కొనియాడారు. యువత రక్తదానం చేయడానికి స్వచ్చందంగా ముందుకు రావాలని సూచించారు. మనం ఆరోగ్యంగా ఉండాలని, ఇతరులకు రక్తదానం చేస్తామనే ధైర్యం కలిగి ఉండాలని పేర్కొన్నారు. అన్ని దానాల కన్నా రక్త దానం గొప్పదని, 18 ఏళ్ల నుంచి 55 ఏళ్లలోపు ఉన్న వ్యక్తులు అందరూ రక్తదానం చేయవచ్చని సూచించారు.ఆరోగ్యవంతులైన ప్రతిఒక్కరూ 3నెలలకోసారి రక్తదానం చేయాలని కోరారు.ఈ శిబిరంలో 94మంది విద్యార్థులు రక్తదానం చేసారు .ఈ కార్యక్రమంలో బీటెక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, డిప్లొమా ప్రిన్సిపల్ వైవిఎన్ రాజశేఖర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎమ్.సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.