నాగార్జునసాగర్ గేట్లు ఇవాళ తెరుచుకున్నాయి. ఎగువ నుంచి భారీగా వరద చేరుకుంటున్న నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు రేడియల్ క్రస్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణమ్మకు ఎస్ఈ నాగేశ్వరరావు, సీఈ అనిల్కుమార్ జలహారతి ఇచ్చి నీటిని దిగువకు విడుదల చేశారు. తొలుత దిగువ ప్రాంతాల ప్రజల అప్రమత్తత కోసం మూడుసార్లు సైరన్ మోగించారు. అనంతరం ఒక్కొక్కటిగా ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్ క్రస్టు గేట్ల ద్వారా దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నీటి నిల్వ 290 టీఎంసీలు పూర్తి స్థాయి నీటి నిల్ల 312 టీఎంసీలుగా ఉంది. నాగార్జునసాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రవాహం ఎక్కువైతే అధికారుల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ దిశా నిర్ధేశం చేశారు.