అటకపై పెట్టిన వస్తువులను ఎలుకలు కొరకడం సహజమే.. కానీ అదే సంఘటన కదులుతున్న రైల్లో జరిగితే..! అది కూడా లగ్జరీ ప్రయాణానికి కేరాఫ్ గా చెప్పే ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో చోటుచేసుకుంటే? కొందరు రైలు ప్రయాణికులకు ఈ చేదు అనుభవం ఎదురైంది. కోల్ కతా నుంచి ముంబైకి వెళ్లే జ్ఞానేశ్వరీ ఎక్స్ ప్రెస్ లో గత శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో ఓ బాధితుడు రైల్వే శాఖ తీరుపై మండిపడ్డాడు. ఎలుకలు తన సూట్ కేసులు ఎలా కొరికాయో చూడండంటూ సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోను పెట్టాడు. వాటిని చూసిన నెటిజన్లంతా అవాక్కయ్యారు. ‘12102 రైలు నంబర్ లో మే 19న ఎక్కా. కోచ్ హెచ్ 1, ఏ2 సీట్లో ప్రయాణించా. నా పీఎన్ ఆర్ నంబర్ 6535087042. నా సూట్ కేసులను ఎలుకలు కొరికేశాయి. దీనిపై ఫిర్యాదు చేసేందుకు అర గంట నుంచి టీసీ కోసం ఎదురుచూస్తున్నా’ అంటూ ఓ ప్రయాణికుడు తన ‘ఎక్స్’ ఖాతాలో ఫొటోలు, వీడియో షేర్ చేశారు.దీనిపై రైల్వే శాఖ స్పందించింది. ‘ఈ విషయం చాలా ఆందోళన కలిగిస్తోంది. మీకు వీలైనంత వెంటనే సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రైల్వే డివిజనల్ మేనేజర్ ద్వారా మీ ఫోన్ నంబర్ సేకరించాల్సి ఉంది. మీరు కావాలంటే railmadad.indianrailways.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే 139కు డయల్ చేసి సత్వర పరిష్కారం పొందొచ్చు’ అని తెలిపింది.