చంద్రగిరి: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం ఉదయం శ్రీ కళ్యాణ వెంకన్నను శ్రీరాముని అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు శ్రీవారి కల్యాణమండపంలో వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.