‘రిపబ్లిక్ డే’ సందర్భంగా కేంద్ర హోం శాఖ పోలీస్, ఫైర్ సర్వీస్, హోంగార్డు, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీస్ పతకాలను ప్రకటించింది. ఈ మేరకు గురువారం అవార్డుల జాబితాను రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా 1132 మందికి గ్యాలంట్రీ/సర్వీసు పతకాలను (Gallantary Awards) అందజేయనుంది. ఇందులో 275 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, ఇద్దరికి ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, 102 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 753 మందికి పోలీస్ విశిష్ట సేవా (మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) పతకాలను ప్రకటించింది. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ ఏటా రెండుసార్లు ఈ పోలీస్ పతకాలను ప్రకటిస్తుంది. అవార్డులు అందుకోనున్న వారిలో జమ్మూ కాశ్మీర్ పోలీసులే అత్యధికం.. 72 మంది పోలీసులను ఈ అవార్డు వరించింది.
ఈ పురస్కారాల్లో తెలుగు రాష్ట్రాల్లో 29 మందికి పతకాలు దక్కాయి. తెలంగాణ (Telangana) నుంచి 20 మంది.. ఏపీ నుంచి 9 మందికి పతకాలు ప్రకటించారు. ఏపీలో 9 మందికి పోలీస్ విశిష్ట సేవా పతకాలు ఇవ్వనున్నారు. తెలంగాణ అడిషనల్ డీజీపీలు సౌమ్య మిశ్రా, దేవేంద్ర సింగ్ చౌహాన్ లను రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు వరించాయి. ఆరుగురు అధికారులకు మెడల్ ఫర్ గ్యాలంట్రీ, పన్నెండు మందికి పోలీస్ విశిష్ఠ సేవా పతకాలు దక్కాయి. ఏపీలో తొమ్మిది మంది అధికారులను పోలీస్ విశిష్ఠ సేవా పతకాలు వరించాయి. కాగా, రాష్ట్రాలవారీగా చూస్తే జమ్మూ కాశ్మీర్ అధికారులకు మొత్తంగా 133 మెడల్స్ దక్కగా, ఛత్తీస్ గఢ్ (26), ఝార్ఖండ్ (23), మహారాష్ట్ర (18) మంది అధికారులు అవార్డులు అందుకోనున్నారు. సీఆర్పీఎఫ్ నుంచి 65 మందికి, సశస్త్ర సీమాబల్ నుంచి 21 మందికి, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్న 119 మంది సిబ్బందికి ఈ మెడల్స్ దక్కాయి.