కంపెనీల చట్టం-2013లోని సిగ్నిఫికెంట్ బెనిఫిషియల్ ఓనర్ (ఎస్బీవో) నిబంధనలను మైక్రోసాఫ్ట్ సారధ్యంలోని ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫారమ్ ‘లింక్డ్ఇన్ ఇండియా’ ఉల్లంఘించింది. కంపెనీకి సంబంధించి ముఖ్య ప్రయోజన యాజమానిని (ఎస్బీవో) గుర్తించి కేంద్రానికి నివేదించడంలో కంపెనీ విఫలమైంది. చట్టంలోని సెక్షన్ 90(1) ప్రకారం నివేదించడంలో కంపెనీ సహా, కీలక స్థానాల్లో ఉన్న పలువురు అధికారులు ఫెయిల్ అయ్యారు. దీంతో మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉన్న సత్య నాదెళ్ల సహా లింక్డ్ఇన్లో పనిచేస్తున్న 8 మంది అధికారులకు కేంద్రం జరిమానా విధించింది. సత్య నాదెళ్ల సహా అందరికీ రూ.2 లక్షలు చొప్పున జరిమానా విధించింది. లింక్డ్ఇన్ కంపెనీకి రూ.7 లక్షలు పెనాల్టీ సహా మొత్తం రూ.27,10,800 మొత్తం జరిమానాగా విధించినట్టు పేర్కొంది.ఈ జాబితాలో సత్య నాదెళ్ల, లింక్డ్ఇన్ కార్పొరేషన్ గ్లోబల్ సీఈవో ర్యాన్ రోస్లాన్స్ సహా ఇతర అధికారులు ఉన్నారు. లింక్డ్ఇన్ సీఈవోగా ర్యాన్ రోస్లాన్స్ జూన్ 1, 2020న నియమితులయ్యారని, అప్పటి నుంచి సత్య నాదెళ్లకు రిపోర్ట్ చేయడం ప్రారంభించారని, కానీ ఎస్బీఓ నిబంధనల విషయంలో విఫలమయ్యారని పేర్కొంది. ఇందుకు సంబంధించిన వివరాలను అందించాలని లింక్డ్ఇన్ను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆదేశించింది.