భారత జట్టు స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మట్ల నుంచి తప్పుకొంటోన్నాడు. ఐపీఎల్ వంటి టోర్నమెంట్లకు అందుబాటులో ఉంటానని వెల్లడించాడు.బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ ముగిసిన తరువాత ఏర్పాటైన పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కేప్టెన్ రోహిత్ శర్మతో కలిసి పాల్గొన్నాడు రవి అశ్విన్. ఈ సందర్భంగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. అయిదు మ్యాచ్లో బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో అడిలైడ్లో జరిగిన రెండో గేమ్ మాత్రమే ఆడాడీ స్టార్ స్పిన్ బౌలర్. ఈ మ్యాచ్లో అతను విఫలం అయ్యాడు. ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు.మూడో టెస్ట్ మ్యాచ్ కోసం తుదిజట్టులోకి ఎంపిక కాలేకపోయాడు. అతని స్థానంలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రీప్లేస్ అయ్యాడు. మూడో టెస్ట్లో రవీంద్ర జడేజా బ్యాటింగ్లో రాణించిన నేపథ్యంలో నెక్స్ట్ గేమ్కు రవిచంద్రన్ అశ్విన్కు చోటు దక్కడంపై అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ పరిస్థితుల మధ్య రవి అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా భావోద్వేగుడయ్యాడు. భారత క్రికెటర్గా ఇదే తన చివరి రోజు అని ప్రకటించాడు. దీనిపై విలేకరుల నుంచి ఎదురైన ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వడానికి నిరాకరించాడు. టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్ రవి అశ్విన్. ఇప్పటివరకు 106 టెస్ట్ మ్యాచ్లను ఆడిన ఈ తమిళనాడు బౌలర్.. 537 వికెట్లు పడగొట్టాడు. అతని కంటే ముందు కర్ణాటకకు చెందిన అనిల్ కుంబ్లే ఉన్నాడు. కుంబ్లే టెస్టుల్లో మొత్తం 619 వికెట్లు కూల్చాడు.రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయం పట్ల భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ స్పందించింది. అతనికి థ్యాంక్స్ చెప్పింది. సుదీర్ఘమైన కేరీర్లో జట్టుకు ఎన్నో విజయాలను అందించిన లెజెండరీగా అభివర్ణించింది. ఆల్ రౌండర్గా కీర్తించింది. రిటైర్మెంట్ తీసుకున్నందుకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పింది బీసీసీఐ.