దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణె యాక్సిడెంట్ కేసులో షాకింగ్ విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రతి దశలోనూ దర్యాప్తు పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరిగినట్టు వెల్లడైంది. నిందిత టీనేజర్కు వైద్య పరీక్షలు నిర్వహించిన ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులపై తాజాగా వేటు పడింది. ఆసుపత్రి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అధిపతితో పాటు మరో వైద్యుడిని ఆధారాలు తారుమారు చేసిన ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి బ్లడ్ శాంపిల్స్ స్థానంలో మద్యం తీసుకోని మరో వ్యక్తి శాంపిల్స్ పెట్టినట్టు ఆరోపణలు రావడంతో వైద్యులను అరెస్టు చేశారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, యాక్సిడెంట్ జరిగిన రోజు ఉదయం 11 గంటలకు నిందితుడిని వైద్య పరీక్షల కోసం ససోన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రమాద సమయంలో టీనేజర్ మద్యం మత్తులో ఉన్నాడని ఆరోపణలు వస్తున్నా అతడి రక్తంలో ఆల్కహాల్ లేనట్టు ఫారెన్సిక్ రిపోర్టు విడుదల చేశారు. ఆ తరువాత రెండో రిపోర్టులో మాత్రం నిందితుడి రక్తంలో మద్యం ఉన్నట్టు వెల్లడైంది. తదనంతరం జరిపిన డీఎన్ఏ పరీక్షల్లో ఈ రెండు శాంపిళ్ల వేర్వేరని వెల్లడైంది. దీంతో, ఆధారాలు తారుమారు చేసిన ఆరోపణలపై ఇద్దరు డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. శాంపిళ్ల తారుమారులో వైద్యుల పాత్ర ఏమిటో తేల్చేందుకు పూణె క్రైమ్ బ్రాంచ్ వారిని విచారిస్తోంది.