రైతుల ఆందోళనల నేపథ్యంలో మోదీ ట్వీట్
క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను ట్విట్టర్ లో పంచుకున్న మోదీ
న్యూఢిల్లీ:ఢిల్లీ బార్డర్ లో రైతుల ఆందోళనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. రైతుల సంక్షేమానికి సంబంధించిన ప్రతి తీర్మానాన్ని నెరవేర్చడానికి కేంద్రం కట్టుబడి ఉందని ట్వీట్ చేశారు. ప్రస్తుత సీజన్ 2023-24లో చెరకు పండించే రైతులకు ఇచ్చే ప్రోత్సాహక మొత్తాన్ని (ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్–ఎఫ్ఆర్పీ) రూ.25 పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో దేశంలోని లక్షలాది చెరకు పండించే రైతులకు మేలు చేకూరనుందని వివరించారు.ఆందోళన చేస్తున్న రైతులను కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి అర్జున్ ముండా మరోసారి చర్చలకు ఆహ్వానించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని సూచిస్తూ.. ఐదో విడత చర్చలకు పిలిచారు. రైతులపై నమోదైన కేసులను ఎత్తేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే, అన్ని పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కల్పించడంతో పాటు, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించిన తర్వాతే మిగతా విషయాలపై చర్చిస్తామని రైతులు స్పష్టం చేసినట్లు సమాచారం.