గురుగ్రామ్లోని ఓ రెస్టారంట్లో భోజనం చేసిన తర్వాత ఐదుగురు కస్టమర్లు తమ నోటిని శుభ్రం చేసుకునేందుకు అక్కడి సిబ్బంది ఇచ్చిన మౌత్ ఫ్రెషనర్ వాడారు. అంతే.. వెంటనే వారి నోటి నుంచి రక్తం కారడంతో పాటు మంటగా ఉందంటూ వారు విలవిలాడిపోయారు. గ్రేటర్ నొయిడాకు చెందిన అంకిత్ కుమార్ అనే వ్యక్తి తన భార్య, నలుగురు స్నేహితులతో కలిసి గురుగ్రామ్ పరిధిలోని సెక్టార్ 90లోని లా ఫారెస్టా కేఫ్కి వెళ్లారు. అక్కడ భోజనం ముగించిన తర్వాత వెయిటర్ ఇచ్చిన మౌత్ ఫ్రెషనర్ తీసుకున్నారు. అలా మౌత్ఫ్రెషనర్ తీసుకున్న వెంటనే వారందరూ రక్తపు వాంతులు చేసుకోవడం మొదలైంది. దాంతో పాటు నోటిలో మంటగా ఉందంటూ వారు అరవడం మొదలెట్టారు. అది గమనించిన తోటి కస్టమర్లు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రెస్టారెంట్ వారు మౌత్ ఫ్రెషనర్లో ఏం కలిపారో తెలియదని, దాన్ని తీసుకున్న వెంటనే నాలుకపై గాయాలు కావడం, రక్తం కారడం మొదలైందని బాధితుడు అంకిత్ కుమార్ పోలీసులకు తెలిపాడు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటన తాలూకు వీడియో కాస్తా బయటకు రావడంతో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.