మోదీ అధ్యక్షతన తొలి కేబినెట్ భేటీలో ఆమోదం లోక్ కల్యాణ్ మార్గ్లోని మోదీ నివాసంలో సమావేశం
న్యూఢిల్లీ:ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్రమంత్రివర్గం సోమవారం సమావేశమైంది. పీఎంఏవై కింద మరో 3 కోట్ల ఇళ్లు నిర్మించేందుకు తొలి కేబినెట్ ఆమోదం తెలిపింది. నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని అయ్యాక లోక్ కల్యాణ్ మార్గ్లోని మోదీ నివాసంలో కేబినెట్ తొలిసారి సమావేశమైంది. ఈ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.అంతకుముందు, రైతులకు సంబంధించి పీఎం కిసాన్ నిధి విడుదల దస్త్రంపై మోదీ తొలి సంతకం చేశారు. దీంతో 9.3 కోట్ల మంది రైతులకు రూ.20 వేల కోట్ల ఆర్థిక సహాయం అందనుంది. కేబినెట్ భేటీకి ముందు పీఎంవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
కేంద్రంలో ఎవరికి ఏ శాఖ ఇచ్చారంటే..?
ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఆదివారం ప్రమాణం స్వీకారం చేసిన 30 మంది కేబినెట్ మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించి… నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద దేశంలో 3కోట్ల ఇళ్లు నిర్మించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. ఈ పథకం కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల మంది పేదలకు గృహాలు నిర్మించనున్నారు.
అలాగే, గ్రామీణాభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.అలాగే, మంత్రులకు శాఖల కేటాయింపుపైనా మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రులకు శాఖలకు కేటాయించింది. నితిన్ గడ్కరీకి రోడ్లు, రవాణా శాఖను కేటాయించారు. గతంలో పనిచేసిన శాఖనే ఆయనకు తిరిగి అప్పగించారు. రోడ్లు, భవనాల శాఖ సహాయ మంత్రులుగా హర్ష్ మల్హోత్రా, అజయ్ తమ్తా అవకాశం దక్కించుకున్నారు. కేంద్ర హోం మంత్రిగా అమిత్ షా, రక్షణ శాఖ మంత్రిగా రాజ్ నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఎస్.జయశంకర్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు మరోసారి బాధ్య తలు అప్పగించారు. అశ్వనీ వైష్ణవ్ – రైల్వే, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ లు ,హర్దీప్ సింగ్ పూరీ – ఇంధన శాఖ, మనోహర్ లాల్ ఖట్టర్ – పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, ధర్మేంద్ర ప్రధాన్ – విద్యా శాఖ ,కిరణ్ రిజుజు – పార్లమెంటరీ వ్యవహారాల శాఖ , రామ్మోహన్ నాయుడు – పౌర విమానయాన శాఖ ,మన్సుఖ్ మాండవీయా – కార్మిక శాఖ, క్రీడలు, శ్రీపాద యశోనాయక్ – విద్యుత్ శాఖ , జేపీ నడ్డా – వైద్య శాఖ ,పీయూష్ గోయల్ – వాణిజ్య శాఖ , శివరాజ్ సింగ్ చౌహాన్ – వ్యవసాయం,గ్రామీణాభివృద్ధి శాఖలు,గజేంద్ర సింగ్ షెకావత్ – టూరిజం, సాంస్కృతిక శాఖలు,జితిన్ రామ్మాంఝీ – చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, శోభ కర్లాంద్జే – చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖల సహాయ మంత్రి, భూపేందర్ యాదవ్ – పర్యావరణ శాఖ, సీఆర్ పాటిల్-జల్ శక్తి శాఖ .