బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో, ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలు నుంచి విడుదలయ్యారు. తీహార్ జైలు వద్ద ఆమెను కుటుంబ సభ్యులు, భర్త, పిల్లలు ఆత్మీయంగా స్వాగతం పలికారు. విడుదల తర్వాత కవిత కన్నీళ్లతో వారిని పలకరించారు. కారెక్కిన తర్వాత ఆమె తన తండ్రి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఫోన్ చేసి మాట్లాడారు. ఐదు నెలల తర్వాత తండ్రి గొంతు విన్న కవిత భావోద్వేగానికి గురయ్యారు.కేసీఆర్ తన కూతురు ఆరోగ్యం గురించి ఆరా తీశారని, కవితను ఓదార్చుతూ ఆమెకు జాగ్రత్తలు చెప్పారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. మంగళవారం రాత్రి జైలు నుంచి విడుదలైన కవిత, ఢిల్లీలోనే బస చేశారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న తర్వాత, ఎర్రవల్లిలోని ఫాంహౌస్కు వెళ్లి తన తండ్రిని కలుసుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.