పిఠాపురం :-
పిఠాపురం నియోజకవర్గ ప్రజల కల నెరవేరుస్తూ, గతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రిగా అభివృద్ధి చేయా లని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ప్రభుత్వం జీవో ఎంఎస్ 156 నంబరుతో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పిఠాపురం ఆస్పత్రి సామర్థ్యం పెరగడంతో పాటు ప్రత్యేక సౌకర్యాలు, అదనపు సిబ్బంది రానున్నారు.పిఠాపురం ఆసుపత్రిలో సౌకర్యాల కల్పన, వసతుల పెంపు కోసం రూ.38.32 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తుంది. పెంచిన పడకలకు అవసరమైన ప్రత్యేక భవనాలు, ఆపరేషన్ థియేటర్లు, వార్డులు, కావలసిన ప్రత్యేకమైన సౌకర్యాల కల్పనకు ఈ నిధులను వెచ్చిస్తారు.పెరిగిన ఆసుపత్రి సామర్థ్యానికి అనుగుణంగా 66 మంది అదనపు వైద్య సిబ్బందిని నియమిస్తారు. వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది దీనిలో ఉంటారు. అలాగే అదనపు విభాగాలు కూడా రానున్నాయి. పిఠాపురం ఆసుపత్రికి జనరల్ సర్జన్, చెవి-ముక్కు-గొంతు నిపుణులు, కంటి వైద్యం, ఆర్థోపెడిక్స్, పెథాలజీ, డెంటల్, రేడియాలజీ వంటి కీలక విభాగాలు రానున్నాయి. నర్సింగ్, వైద్య సిబ్బంది పెరగనున్నారు. పవన్ హామీ ఇచ్చిన ఆరు నెలలలోపే దీన్ని అమలు చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యవసతులు కల్పన చేయనున్నారు. పిఠాపురం పట్టణంతోపాటు నియోజకవర్గంలోని గ్రామాలు, సమీపంలో పలు నియోజకవర్గాల ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.