పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి పెద్ద షాక్ గా మారింది. ఆయన ఈ నిర్ణయాన్ని పిఠాపురంలోని తన నివాసం వద్ద మీడియాకు వెల్లడించారు. దొరబాబు తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్డీయే కూటమితో కలిసి పనిచేయాలని భావిస్తున్నారని చెప్పారు. కానీ, తన భవిష్యత్తు రాజకీయ ప్రణాళికల గురించి త్వరలో వెల్లడిస్తానని పేర్కొన్నారు.
దొరబాబు పిఠాపురం నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో బీజేపీ అభ్యర్థిగా, 2019లో వైసీపీ తరఫున గెలిచారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2024లో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలిచారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పై పోటీ చేసేందుకు వైసీపీ వంగా గీతను బరిలోకి దింపింది.
గత ఎన్నికల్లో వంగా గీతకు టిక్కెట్ ఇవ్వడం, ఆమె పార్టీ కార్యాలయాన్ని దొరబాబు నివాస సమీపంలోనే ఏర్పాటు చేయడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. ఎన్నికలకు ముందు పార్టీని వీడాలని భావించినా, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బుజ్జగించడంతో పార్టీ లోనే ఉండిపోయారు. ఎన్నికల సమయంలో దొరబాబు అచేతనంగా వ్యవహరించారు. ఇప్పుడు వైసీపీని వీడి కొత్త మార్గం ఎంచుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

