ఎన్నికల్లో కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా అభినందనలు
కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలి
ఓట్ల లెక్కింపులో ఏ అనుమానం ఉన్నా వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలి
పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై రాద్ధాంతం చేయాలనుకున్న వైసీపీకి సుప్రీం కోర్టులోనూ మొట్టికాయలు తప్పలేదు
ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ కౌంటింగ్ లో హింసకు పాల్పడేందుకు సిద్ధంగా ఉంది..కూటమి కౌంటింగ్ ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దు..నిబంధనలకు పట్టుబట్టండి
కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
అమరావతి :- ప్రజల ఐదేళ్ల పాటు పడ్డ కష్టాలకు రేపటితో అడ్డుకట్ట పడబోతోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. మంగళవారం ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని, లెక్కింపులో ఏ అనుమానం ఉన్నా వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో సోమవారం టెలీకాన్ఫరెన్స్ తీసుకున్న చంద్రబాబు నాయుడు వారికి పలు సూచనలు చేశారు. ‘‘ఐదేళ్లు ఎంతో కష్టపడ్డారు….ఈ కష్టాన్ని, శ్రమను వచ్చే 24 గంటల పాటూ కొనసాగించాలి. ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని నిలబడ్డాం. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై రాద్ధాంతం చేయాలనుకున్న వైసీపీకి సుప్రీం కోర్టులోనూ మొట్టికాయలు తప్పలేదు. ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ కౌంటింగ్ లో హింసకు పాల్పడేందుకు సిద్ధంగా ఉంది..కూటమి కౌంటింగ్ ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దు..నిబంధనలకు పట్టుబట్టాలి. కౌంటింగ్ ఏజంట్లు ఎలా వ్యవహరించాలో ఇప్పటికే శిక్షణ ఇచ్చాం. ఏజెంట్లు నిర్ధేశిత సమయానికి కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లాలి. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు…తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అన్ని రౌండ్లు పూర్తయ్యే వరకు ఏజెంట్లు ఎవరూ బయటకు రావొద్దు. కంట్రోల్ యూనిట్ నెంబర్ ప్రకారం సీల్ ను ప్రతి ఏజెంట్ సరి చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ 17-సీ ఫాం దగ్గర ఉంచుకుని పోలైన ఓట్లను…కౌంటింగ్ లో వచ్చిన ఓట్లను సరి చేసుకోవాలి. అన్ని రౌండ్లు పూర్తయ్యాక పోలైన ఓట్లకు, కౌంటింగ్ లో వచ్చిన ఓట్లలో తేడాలు ఉంటే వీవీప్యాట్ లు లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ కు వెళ్లిన ఏజంట్లకు ఏమాత్రం అనుమానం ఉన్నా ఆర్వోకు అభ్యంతరం తెలపవచ్చు. ఆర్వోలకు ఇచ్చిన ఫిర్యాదులపై ఎక్నాలెడ్జ్ మెంట్ తప్పకుండా తీసుకోవాలి. మనకున్న అభ్యంతరాలపై నిబంధనలు పాటిస్తూనే అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. డిక్లరేషన్ ఫామ్ తప్పుకుండా తీసుకోవాలి. అనారోగ్య కారణాలతో ఏజంట్ ఎవరైనా రాలేకపోతే నిబంధనల ప్రకారం కౌంటింగ్ కు ముందే మరొకరిని నియమించుకునే వెసులుబాటు ఉంది. నిబంధనలు అమలయ్యేలా చూడటంలో ఎవరూ రాజీ పడొద్దు. ప్రతి ఓటూ కీలకమే అనేది ఏజెంట్లు గుర్తుంచుకుని లెక్కింపు ప్రక్రియలో పాల్గొనాలి.’’ అని చంద్రబాబు నాయుడు సూచించారు.

