బీహార్లోని హాజీపూర్లో ఆదివారం రాత్రి ఘోర విషాద చోటు చేసుకుంది. డీజే ట్రాలీ హైటెన్షన్ విద్యుత్ వైర్లను తాకడంతో 9 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ చేసినా విద్యుత్ శాఖ ఉద్యోగులు వెంటనే సరఫరా ఆపలేదని వారు ఆరోపిస్తున్నారు. సరఫరా ఆపి ఉంటే చాలా మంది ప్రాణాలతో ఉండేవారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడి చేరుకుని స్థానికుల సహాయంతో క్షతగాత్రులందరినీ హాజీపూర్ లోని సదర్ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై వివరాల ప్రకారం.. వైశాలి జిల్లాలోని హాజీపూర్-ఇండిస్టియల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామంలో రాత్రి 11:00 గంటలకు శివభక్తులు గ్రామం నుండి ఊరేగింపుగా బయలుదేరారు. ఈ క్రమంలో డీజే ట్రాక్టర్ ట్రాలీకి హైటెన్షన్ వైర్లు తగలడంతో తొమ్మిది మంది కన్వారియాలు అక్కడికక్కడే మరణించగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు సుల్తాన్పూర్ గ్రామానికి చెందినవారు కాగా, మిగిలిన ఐదుగురు జాధువా బధాయి తోలా నివాసితులుగా పోలీసులు గుర్తించారు.