- ఇంద్రకీలాద్రిపై ఘన స్వాగతం పలికిన అధికారులు, ప్రజాప్రతినిధులు
- దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వచనం అందుకున్న ముఖ్యమంత్రి దంపతులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గురువారం ఆయన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ముఖ్యమంత్రి దంపతులకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, ఆర్జేసీ రత్నరాజు, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎస్.రామరావు, మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఆర్డీవో బీహెచ్ భవానీ శంకర్, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము, తెలుగుదేశం నాయకులు బుద్దా వెంకన్న, కె.పట్టాభి రామ్, నాగుల్ మీరా, జంపాల సీతారామయ్య తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం చిన్నారులు సంప్రదాయ నృత్యంతో స్వాగతం నడుమ ముఖ్యమంత్రి దంపతులు రాజగోపురం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆలయ వేద పండితులు పూర్ణకుంభంతో ముఖ్యమంత్రి దంపతులకు స్వాగతం పలికి వేదమంత్రోచ్ఛారణతో అమ్మవారి దర్శనానికి తోడ్కొని వెళ్లారు. అంతరాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికారు. దేవాదాయ శాఖ కమిషనర్, ఆలయ ఈవోలు ముఖ్యమంత్రి దంపతులకు అమ్మవారి శేషవస్త్రం, పట్టు వస్త్రాలను, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి దంపతులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు.