దేశంలో 15 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, బీజేపీ అత్యధికంగా 10 స్థానాలు కైవసం చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లో 10, కర్ణాటకలో 4, హిమాచల్ ప్రదేశ్ లో ఒక స్థానానికి నేడు ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ తన ఆధిపత్యం చాటుకుంటూ 8 రాజ్యసభ స్థానాలు కైవసం చేసుకుంది. మిగతా రెండు స్థానాలు విపక్ష సమాజ్ వాదీ పార్టీ గెలుచుకుంది. దీనిపై ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందిస్తూ… రాజ్యసభ ఎన్నికలతో బీజేపీ విజయ యాత్ర మొదలైందని, అది లోక్ సభ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని అన్నారు. ఇక, కర్ణాటకలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా… అధికార కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు చేజిక్కించుకుంది. బీజేపీకి ఒక స్థానం లభించింది. సొంత ఎమ్మెల్యే ఎస్.టి. సోమశేఖర్ క్రాస్ ఓటింగ్ కు పాల్పడడం బీజేపీ అవకాశాలను దెబ్బతీసింది.హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికలు జరిగిన ఒకే ఒక రాజ్యసభ స్థానాన్ని అదృష్టం కొద్దీ బీజేపీ చేజిక్కించుకుంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులిద్దరికీ సమానంగా 34 ఓట్ల చొప్పున లభించాయి. దాంతో ‘టాస్’ విధానాన్ని ఆశ్రయించగా, బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ విజేతగా నిలిచినట్టు ప్రకటించారు.