హైదరాబాద్ నగరంలోని కొత్తపేటలో అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. ఇదేంటని అడిగిన ఓ వ్యక్తిని ఆ బ్యాచ్ చితకబాదింది. అయితే, ఈ గంజాయి బ్యాచ్ దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి వరకు రోడ్లపై బైఠాయించి పోకిరీలు బ్యాచ్లుగా గంజాయి తాగుతున్నారు. దీంతో కొత్తపేటలోని ఓ కాలనీలో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తమ ఇంటి ముందు గంజాయి బ్యాచ్ ఉంటే అక్కడి నుంచి వెళ్లాలని ఇంటి యజమాని జనార్దన్ నాయుడు వారితో చెప్పాడు. అంతే.. మమ్మల్నే వెళ్లమంటావా అంటూ ఇంటి యజమానిపై ఒక్కసారిగా గంజాయి బ్యాచ్ కర్రలతోనూ, రాళ్లతోనూ విచక్షణ రహితంగా దాడి చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. గంజాయి బ్యాచ్ దాడిలో జనార్దన్ నాయుడు తీవ్రంగా గాయపడడంతో, అతనిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అతనిపై జరిగిన దాడిని స్థానికులు సెల్ఫోన్లో వీడియో తీశారు. ప్రతిరోజు ఇలానే బయటనుంచి వచ్చి గంజాయి బ్యాచ్ న్యూసెన్స్ చేస్తారని స్థానికులు వాపోయారు. తనపై దాడికి సంబంధించి సరూర్నగర్ పోలీసులకు బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో గంజాయి బ్యాచ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.