తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పీకర్కు రాసిన లేఖపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. సభాపతిని లక్ష్యంగా చేసుకుని వక్రభాష్యంతో జగన్ లేఖ రాశారని మండిపడ్డారు. ఆయన బెదిరింపు రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు. జగన్ ఇకనైనా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు చేయాలని, లేదంటే ఇప్పుడున్న క్రికెట్ టీం కాస్తా వాలీబాల్ టీం అవుతుందని ఆయనకున్న ఎమ్మెల్యేలను గుర్తుచేస్తూ హెచ్చరించారు. జగన్ను ప్రజలు పాతాళానికి తొక్కేశారని, అయినప్పటికీ చంద్రబాబు పెద్దమనసుతో ఆయనకు గౌరవం ఇవ్వాలని ఆదేశించారని, అర్హత లేకున్నా గౌరవం లభించింది అందుకేనని గుర్తుచేశారు. ఆయన వాహనాన్ని కూడా లోపలికి అనుమతించారని పేర్కొన్నారు. అయినప్పటికీ స్పీకర్ను లక్ష్యంగా చేసుకుని లేఖ రాసి తన బుద్ధి మారలేదని నిరూపించుకున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

