హైదరాబాద్:హైదరాబాదులోని పలు బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. సికింద్రాబాద్, మెహదీపట్నం, మల్కాజ్ గిరి, హిమాయత్ నగర్, లక్డీకాపూల్, మలక్ పేట్, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురిలోని 9 బ్లడ్ బ్యాంకుల్లో డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారులు తనిఖీలు చేపట్టారు. కొన్ని బ్లడ్ బ్యాంకుల్లో ప్రమాణాలకు తిలోదకాలిచ్చి నాసిరకం వస్తువులు ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. అంతేకాదు, రక్తం సేకరించడం నుంచి పంపిణీ వరకు అనేక అవకతవకలు జరుగుతున్న విషయం గుర్తించారు.రక్తం సేకరించిన తర్వాత అందులోని ప్లేట్ లెట్లు, ప్లాస్మా నిల్వ చేసే సమయంలో లోపాలు ఉండడం వల్ల, ఆ రక్తం ఎక్కించిన రోగులకు పలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తరచుగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలోనే డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో పలు బ్లడ్ బ్యాంకులకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.