హైదరాబాద్:తెలంగాణ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల కోసం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి వచ్చారు. నాంపల్లిలో బస్ ఎక్కిన వెంకట్ అసెంబ్లీ వరకు ప్రయాణిం చారు. ఈ సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై మహిళలు సానుకూలంగా స్పందించారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు మాత్రమే ఉచితం. కాబట్టి ఎమ్మెల్సీ వెంకట్ కండక్టర్కు డబ్బులు ఇచ్చి టిక్కెట్ కూడా తీసుకున్నారు.వెంకట్ గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అమరవీరుల ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి ఎదిగానన్నారు.తాను పదేళ్లపాటు యువకుల పక్షాన పోరాటం చేశానని బల్మూరి వెంకట్ తెలిపారు. విద్యార్థులు, యువకులు ఎలాంటి సమస్య వున్నా తన దృష్టికి తీసుకు రావొచ్చునన్నారు. ఎప్పటికి తన కులం యువ’కులమే’ అన్నారు.