సమగ్ర శిక్ష పధక అధికారి డాక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి
కడప అర్బన్
అవయవ లోపాలను అధిగమించి సాధారణ జనజీవన స్రవంతిలో మమేకం అయ్యేలా దివ్యాంగులలో ఉత్సాహం నింపాలని సమగ్ర శిక్ష పథకాధికారి డాక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. కడప మండల విద్యా వనరుల కేంద్రంలో నూతనంగా విధులలో చేరిన సహిత విద్యా రిసోర్స్ పర్సన్ లతో బుధవారం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు విధి వంచితులు కాకుండా విధాతలుగా మారేలా వారిలో ఉత్సాహాన్ని ధైర్యాన్ని నింపాలని సహిత విద్యా రిసోర్స్ పర్సన్ లను కోరారు. విధి నిర్వహణలో తోటి ఉపాధ్యాయులతో అధికారులతో, పిల్లల తల్లిదండ్రులతో, ప్రజలతో సన్నిహితంగా ఉంటూ విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం, ఎప్పటికప్పుడు నూతన విషయాలను తెలుసుకోవడం, మంచి భాషను ఉపయోగించడం చేయాలన్నారు. అవసరమైన వారికి సేవలు అందించడంలో ఆనందం వెతుక్కోవాలని సూచించారు. సహిత విద్యా సమన్వయకర్త మిట్టా కేశవరెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల చట్టాలను తెలుసుకొని వారికి అందాల్సిన అలవెన్స్లను, ఉపకరణాలను సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సహిత విద్యా రిసోర్స్ పర్సన్లు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకొని దివ్యాంగ విద్యార్థులను చైతన్యవంతులుగా చేయాలని సూచించారు. కార్యక్రమంలో అక్కడనిక్ మానిటరింగ్ అధికారిని ధనలక్ష్మి, సమగ్ర శిక్ష కార్యాలయ సూపర్డెంట్ మురళీమోహన్,జీసీడివో విజయలక్ష్మి, ఏపీవో రజనీకాంత్ రెడ్డి, దశరథ రామిరెడ్డి,రామాంజనేయ రెడ్డి, ప్లానింగ్ అధికారి లక్ష్మీనరసింహరాజు, ఆర్పీలు విజయ, మమత, సిద్ధారెడ్డి, గంగులప్ప తదితరులు పాల్గొని ఇటీవల జిల్లా ఉత్తమ అధికారిగా జిల్లా కలెక్టర్ చే ప్రశంసపత్రం స్వీకరించిన డాక్టర్ ప్రభాకర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు.