ఆస్ట్రేలియాకు డ్రగ్స్ ఎగుమతి చేస్తున్నారనే ఆరోపణలతో అరెస్టయిన భారత సంతతి భార్యాభర్తలు ఆరతీ ధీర్, కవల్ జిత్ సింహ్ రాయ్ జాదాలకు లండన్ కోర్టు 33 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సుదీర్ఘ విచారణ తర్వాత దోషులుగా తేల్చి తాజాగా శిక్ష ఖరారు చేసింది. ఈ జంటను పోలీసులు 2021లో అరెస్టు చేశారు. అరెస్టుకు ముందు హాన్ వెల్ లోని వారి నివాసంలో పోలీసులు సోదా చేయగా … దాదాపు రూ. 31 కోట్ల విలువైన యూరోలు నగదు రూపంలో దొరకగా.. రూ.8 కోట్ల విలువైన ఇల్లు, ఖరీదైన లాండ్ రోవర్ కారు, మొత్తం 22 బ్యాంకుల్లో డిపాజిట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.గతంలో హీత్రూ విమానాశ్రయంలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవంతో ఆరతీ, రాయ్ జాదాలు లండన్ లో సొంతంగా సరుకు రవాణా కంపెనీ పెట్టుకున్నారు. తమకున్న అనుభవంతో చెకింగ్ అధికారులను బోల్తా కొట్టిస్తూ ఆస్ట్రేలియాకు డ్రగ్స్ ఎగుమతి చేశారు. 2014 నుంచి 2016 వరకు వీరి దందా నిర్విగ్నంగా జరిగిందని, మెటల్ బాక్స్ లలో డ్రగ్స్ పెట్టి ఆస్ట్రేలియా పంపించే వారని అధికారులు తెలిపారు. ఇలా టన్నుల కొద్దీ డ్రగ్స్ ను పంపించినట్లు బయటపడిందన్నారు. ఆస్ట్రేలియా కస్టమ్స్ అధికారులు ఈ దందాను గుర్తించి అడ్డుకోవడంతో పాటు యునైటెడ్ కింగ్ డమ్ జాతీయ నేర విచారణ సంస్థ (ఎన్ సీఏ) ను అప్రమత్తం చేశారు. దీంతో ఎన్ సీఏ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టగా ఆరతీ, రాయ్ జాదాల డ్రగ్స్ దందా బయటపడింది.

