న్యూఢిల్లీ: స్కిల్ స్కాంలో హైకోర్టు చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని సీఐడీ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీని పైన సుప్రీం ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. చంద్రబాబు న్యాయవాదుల అభ్యర్దన మేరకు ఈ కేసు విచారణ ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేసింది. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది.. స్కిల్ కేసులో హైకోర్టు చంద్రబాబుకి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరపనుంది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ల ధర్మాసనం ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరులో తమ వాదనలు, ఆధారాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సీఐడీ తమ పిటిషన్లో పేర్కొంది. సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే అందుబాటులో లేరని, అందుకే విచారణ వాయిదా వేయాలని చంద్రబాబు న్యాయవాదుల బృందం తరఫున సిద్ధార్థ్ లూథ్రా సుప్రీం ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. తమకు 3 వారాల సమయం ఇవ్వాలని విన్నవించారు. అందుకు ఏపీ సీఐడీ తరఫు న్యాయవాది రంజిత్ కుమార్ స్పందిస్తూ… గతంలో కౌంటర్ దాఖలు చేయడానికి ఇలాగే సమయం తీసుకున్నారని, ఇప్పుడు కూడా మళ్లీ వాయిదా కోరుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు తరఫున ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసినందున, వీలైనంత త్వరలో తదుపరి విచారణ చేపట్టేలా తేదీని నిర్ణయించాలని రంజిత్ కుమార్ సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. దీంతో వెంటనే చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఏపీ సీఐడీ కోరుతోంది.ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది.