- బీజేపీకి బానిసలుగా మారిన టీడీపీ, వైసీపీలు
- ఇరు పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టాయి
- బీజేపీకి తొత్తులై అనంత ప్రాజెక్ట్ కి తూట్లు పొడిచారు
- అనంతపురం జిల్లా అంటే వైఎస్సార్ కి ప్రియమైన జిల్లా
- అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఏపీ సీసీ చీఫ్ వైఎస్. షర్మిలా రెడ్డి
- సమావేశంలో పాల్గొన్న రఘువీరా రెడ్డి, శైలజానాథ్ ఇతర ముఖ్య నేతలు
అనంతపురము
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతటి త్యాగాలకైనా తాను సిద్ధమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీ సీసీ) చైర్పర్సన్ వైఎస్.షర్మిలా రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల నూతనంగా పిసిసి చీఫ్ గా ఎన్నికైన సందర్భంగా వైఎస్. షర్మిలా రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టిన విషయం తెలిసింది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి అనంతపురంలోని లలిత కళాపరిషత్ లో అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్. షర్మిలా రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో రఘువీరా రెడ్డి, శైలజానాథ్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్. షర్మిలా రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీలు, పార్టీ రాజకీయ విధానాల పైన ధ్వజమెత్తారు. బీజేపీకి టీడీపీ, వైసీపీలు
బానిసలుగా మారి, రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టాయని ఆరోపించారు.
ఈ క్రమంలో రైతుల సంక్షేమం కోసం తాపత్రయపడిన రఘువీరా రెడ్డి ప్రాజెక్ట్ అనంతను సృష్టించారని, ఈ ప్రాజెక్టును టిడిపి, వైఎస్ఆర్సిపి పార్టీలు బిజెపితో తొత్తులుగా మారి అటకెక్కించేశారని షర్మిలా రెడ్డి ధ్వజమెత్తారు. “అనంతపురం జిల్లా కరువు జిల్లా.. దేశంలోనే అత్యల్ప వర్షపాతం కలిగి ఉన్న జిల్లాల్లో అనంత జిల్లాది రెండో స్థానం.. ఇక్కడి ప్రజలను బ్రతించుకోవాలంటే అభివృద్ధి ఒక్కటే మార్గం అని వైయస్సార్ నమ్మాడు” అన్నారు. ఇక్కడి ప్రజలకు మంచినీళ్ళ కోసం రఘువీరా రెడ్డి తాత పేరు మీద మంచినీటి పథకం ప్రారంభించారన్నారు.
ఉపాధి హామీ పథకం ఈ జిల్లా నుంచే వైఎస్సార్ ప్రారంభించారని గుర్తు చేశారు. వైఎస్సార్ హయాంలో ఇక్కడ 22 లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంట వేసే వారని, వేరుశెనగ పంట పండక పోతే.. డబ్బులు పండిస్తాం అన్నారని తెలిపారు. వైఎస్సార్ హయాంలో క్రాప్ ఇన్సూరెన్స్ ఉండేదని, రైతులకు భరోసా ఉండేదని, కానీ ఇప్పుడు 3 లక్షల ఎకరాల్లో కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పంట వేయడం లేదని అన్నారు. పంటల బీమా లేకపోవడంతో సాగుకు రైతులు సాహసం చేయడం లేదన్నారు. దీనికి కారణం జగనన్న ప్రభుత్వమే అని వైఎస్.షర్మిలా రెడ్డి విమర్శించారు. వైఎస్సార్ హయాంలో వ్యవసాయంపై సబ్సిడీ ఉండేదని, అన్ని రకాల పరికరాలు సబ్సిడీపై వచ్చేవని, ఇప్పుడు సబ్సిడీ అనే పథకమే లేదని, సబ్సిడీలు ఎత్తివేసిన జగనన్న ఇక్కడి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రామగుండం ఐరెన్ ఒర్ తీసి ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలని వైఎస్సార్ అనుకున్నారని, వైఎస్సార్ వెళ్ళిపోయాక…. ఈ పరిశ్రమ కూడా వెళ్ళిపోయిందని అన్నారు. వైఎస్సార్ వెళ్ళిపోయాక రఘువీరా రెడ్డి రైతుల కోసం చాలా తాపత్రయ పడ్డారని, ఇక్కడ రైతులకు మేలు చేసేందుకు కేంద్రానికి లేఖ రాశారని, ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అనంత సృష్టికర్త రఘువీరా రెడ్డే అని, 8 వేల కోట్ల రూపాయలు కూడా విడుదల చేయించారని ఆమె గుర్తు చేశారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు అన్ని ఇక్కడికే వచ్చేవి..కాంగ్రెస్ ఓడిపోవడంతో అంతా వృధా అయ్యింది.. అని అన్నారు. గత 10 ఏళ్లుగా టీడీపీ, వైసీపీ అధికారంలో ఉండి ప్రాజెక్ట్ అనంత గురించి పట్టించుకోలేదని, బీజేపీకి బానిసలుగా మారి.. అనంత ప్రాజెక్ట్ కి తూట్లు పొడిచారని విమర్శించారు. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే..6.50 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేవని, ఈ ప్రాజెక్ట్ పూర్తి అయి ఉంటే .. నాలుగు జిల్లాలకు సాగునీరు వచ్చేవని, 90 శాతం పనులు హంద్రీనీవా పనులు వైఎస్సార్ పూర్తి చేశారని,10 శాతం పనులు జగన్ అన్న పూర్తి చేయలేక పోయాడని వ్యాఖ్యానించారు. హంద్రీనీవా కోసం జల దీక్ష కూడా చేశాడని, 6 నెలల్లో పూర్తి చేస్తా అని హామీ ఇచ్చారని విమర్శించారు.
“ఇది నా పుట్టిల్లు ..ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి.. ఇక్కడ ప్రజల హక్కులు హరిస్తున్నారు కాబట్టి.. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కొట్లాడటానికి అడుగు పెట్టింది వైఎస్సార్ బిడ్డ”
అని వైఎస్. షర్మిలా రెడ్డి ప్రజలకు తెలియజేశారు. బీజేపీకి బానిసలుగా మారిన జగన్ కి, చంద్ర బాబుకి ఎందుకు ఓటు వేయాలి? ఆంధ్ర ప్రజల హక్కులను తాకట్టు పెట్టినందుకు ఓటు వేయాలా? అని ఆమె ప్రశ్నిస్తూ, ఆంధ్ర ప్రజల కోసం కొట్లాడుతుంటే నాపై దాడులు చేస్తున్నారని అన్నారు. నాపై ఎంత దాడులు చేసినా పర్వాలేదు..
నా కుటుంబాన్ని చీల్చినా పర్వాలేదు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఏ త్యాగానికైనా సిద్ధం అన్నారు. జగనన్న ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదని, జనవరి 1న ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అన్నారని, ఐదేళ్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదని, కనీసం ఒక డీఎస్సీ కూడా లేదని వైఎస్. షర్మిలా రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని తూర్పారపట్టారు.