Wednesday, February 18, 2026

Creating liberating content

తాజా వార్తలుఅసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహం పెట్టాలి.. స్పీకర్‌ను కోరిన ఎమ్మెల్సీ కవిత

అసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహం పెట్టాలి.. స్పీకర్‌ను కోరిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్:-గతంలో భారత జాగృతి నేతృత్వంలో జరిగిన ఉద్యమంతో ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీ ప్రాంగణంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటయిందని .. అదేవిధంగా సమానత్వ స్ఫూర్తిని నిలిపేలా తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో జ్యోతీరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆధునిక భారత దేశంలో పునరుజ్జీవన ఉద్యమ పితామహుడిగా మహాత్మా జ్యోతీరావు పూలే కృషి చిరస్మరణీయమన్నారు. ఈ మేరకు కవిత ఆదివారం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. అణగారిన వర్గాలు, మహిళల పట్ల వివక్షకు చరమగీతం పాడుతూ ఈ దేశంలో సామాజిక సమానత్వానికి బాటలు వేసిన ఆద్యులని కొనియాడారు. వివక్షకు గురైన వర్గాల గుడిసెల్లో అక్షర దీపాలు వెలిగించిన కాంతిరేఖ పూలే అని వ్యాఖ్యానించారు.
మహోన్నతమైన పూలే వ్యక్తిత్వం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని కవిత చెప్పారు. పూలేను తన గురువుగా అంబేద్కర్ ప్రకటించుకున్నారని గుర్తు చేశారు. ఉన్నతమైన, ఉదాత్తమైన ప్రజాస్వామిక భావనలు చట్టసభల్లో నిరంతరం ప్రతిఫలించాలనే ఉద్దేశంతో మహనీయుల విగ్రహాలు ఆ ప్రాంగణంలో నెలకొల్పడం గొప్ప ఆదర్శమని అన్నారు. గతంలో జాగృతి నేతృత్వంలో జరిగిన ఉద్యమంలో ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీ ప్రాంగణంలో డా.అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు జరిగిందని గుర్తు చేశారు. ఇది అందరికీ గర్వకారణమని చెప్పారు. సమానత్వ స్ఫూర్తిని అనునిత్యం చట్టసభల స్మృతిపథంలో నిలిపే సదుద్దేశంతో మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహ ఏర్పాటు కూడా తెలంగాణ అసెంబ్లీలో జరగడం అవసరమన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article