తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఎల్బీ స్టేడియం వేదికగా సమర శంఖం పూరించింది. జాతీయ నేతలు హాజరైన ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి వారంలో మూడు రోజులు జనాల్లోనే ఉంటానని ప్రకటించారు. కార్యకర్తలు కష్టపడి పనిచేసి.. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని అందించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఒక వైపు పాలన చూసుకుంటూనే మరోవైపు.. ప్రజల్లో ఉంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పులి బయటికి వస్తుంది అని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు స్పందిస్తూ… పులి బయటికి వస్తే బోను రెడీగా ఉందని హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో జరిగిన కాంగ్రెస్ బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశంలో తెలిపారు.సీఎం పదవి అంటే గుంపు మేస్త్రి పాత్ర వంటిదని చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్కు రేవంత్ గట్టిగా సమాధానం ఇచ్చారు. నేను గుంపు మేస్త్రీనేనని.. విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మాణం చేస్తున్న మేస్త్రీని అంటూ బీఆర్ఎస్పై ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీని ఘోరీ కట్టే మేస్త్రీని కూడా తానే అంటూ సవాల్ విసిరారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ బీఆర్ఎస్ నేతలు.. ముఖ్యంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు చేస్తున్న ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టారు. గతంలో మార్చి వరకు కూడా రైతు బంధు వేసిన వారు ఇప్పుడు మాట్లాడుతున్నారని హేళన చేశారు. ఫిబ్రవరి నెలాఖరులోగా అందరికీ రైతు భరోసా కింద అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలు చేస్తుండగా.. ఫిబ్రవరి మొదటి వారంలోనే మరో రెండు గ్యారెంటీలకు శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. ఇక వంద రోజుల్లో మొత్తం 6 గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణలో కార్యకర్తల కష్టంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కార్యకర్తల చెమటతో తాను సీఎం అయ్యానని.. అదే కష్టాన్ని లోక్సభ ఎన్నికల్లోనూ చూపించాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులు కూడా కాకముందే.. బీఆర్ఎస్ నేతలు హామీలు అమలు చేయలేదని విమర్శలు చేస్తున్నారన్న రేవంత్ రెడ్డి.. వాళ్ల పాలనలో ఏమీ చేయలేదని మండిపడ్డారు. బిల్లా, రంగాలు తమ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి బయల్దేరారని బీఆర్ఎస్ నేతలను విమర్శించారు. రాష్ట్రం ఏర్పడేనాటికి మిగులులో ఉన్న తెలంగాణను పదేళ్లు పాలించి లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని ఆరోపించారు. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.దేశంలో త్యాగం అంటే గాంధీ కుటుంబానిదేని రేవంత్ రెడ్డి తెలిపారు. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీదేనని తెలిపారు. ఇక సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను వేధించేందుకే ప్రధాని మోదీ.. ఈడీ, సీబీఐ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రతో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ప్రజల సంక్షేమం, అభివృద్ది కోసం లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు.