Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుబీ అంటే బాబు,జే అంటే జగన్,పీ అంటే పవన్..

బీ అంటే బాబు,జే అంటే జగన్,పీ అంటే పవన్..

బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు వైసీపీ, టీడీపీ. ఈ రెండు పార్టీలు బీజేపీకి బానిసలు. టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే.. వైసీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే. ఈ రెండు పార్టీలే కాదు… జనసేన పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే. బీజేపీ అంటే ఏమిటో కాదు…. బీ అంటే బాబు, జే అంటే జగన్, పీ అంటే పవన్.. బీజేపీ అంటే ఎక్కడో లేదు… వీళ్లలోనే ఉంది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తిరిగి ఈ విషయాన్ని ప్రజలకు వివరించి చెప్పాలి” అని షర్మిల అన్నారు.
ఏలూరులో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ … రాష్ట్ర విభజన నాటికి ఏపీకి ఉన్న అప్పులు రూ.1.80 లక్షల కోట్లు .. ఆ తర్వాత ఐదేళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో మరో రూ.1.80 లక్షల కోట్ల అప్పులు చేశారు.. గత ఐదేళ్లుగా జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు.. వైసీపీ పాలనలో ఈ ఐదేళ్లలో చేసిన అప్పులు ఎనిమిది లక్షల రూపాయలు .. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు చూస్తే మొత్తం అప్పు రూ.11 లక్షల కోట్లకు పైమాటే అని షర్మిల అన్నారు.
“ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించిన వాస్తవం ఇదీ. ఈ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పులు చేసింది కదా… మరి రాష్ట్రంలో ఆ డబ్బు (అభివృద్ధి) కనిపిస్తోందా? ఇన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చినా రాష్ట్రంలో కనీసం ఒక మెట్రో కూడా లేదు. రూ.8 లక్షల కోట్ల అప్పు తెచ్చారు కదా… రాజధాని కట్టారా? అసలు రాజధాని ఉందా? చంద్రబాబేమో అమరావతి రాజధాని అన్నారు, సింగపూర్ లా చేస్తానన్నారు. త్రీడీ గ్రాఫిక్స్ తో ఆకాశంలోనే సినిమా చూపించారు. రాజధాని కట్టేస్తాడేమో అనుకున్నారు… తీరా చూస్తే ఏమీ కాలేదు. ఆ తర్వాత జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు. పోనీ ఇప్పుడైనా మనకో రాజధాని వస్తుందనుకుంటే… మూడు రాజధానులు అన్నారు. మొత్తం గందరగోళమే! మూడింట్లో ఒక్కటి కూడా రాజధాని కాలేదు.కనీసం పోలవరం అయినా కట్టారా? అదీ లేదు. రాజశేఖర్ రెడ్డి గారి కలల ప్రాజెక్టు పోలవరం. 1941లోనే పోలవరం కట్టాలనుకున్నారు. కానీ, అంత సాహసం నాటి నేతలు చేయలేకపోయారు. రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయ్యాక రూ.10 వేల కోట్లతో పోలవరం ప్రాజెక్టు ప్రారంభించారు. రాజశేఖర్ రెడ్డి తర్వాత ఆ ప్రాజెక్టు ముఖం చూసినవాళ్లే లేరు.
2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ నేతలు మంత్రి పదవులు కూడా తీసుకున్నారు. ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో పొత్తు అన్న చంద్రబాబు… పోలవరం కోసం నిధులు తీసుకురాలేకపోయారు. మాకు డబ్బులు ఇవ్వండి… మేమే పోలవరం కట్టుకుంటాం అని చెప్పారు. రూ.15 వేల కోట్లు తెచ్చుకుని కూడా పోలవరం పూర్తి చేయలేకపోయారు.
ఇక, జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 2021 నాటికి పోలవరం పూర్తి చేస్తానని ప్రకటించారు. తీరా చూస్తే ప్రాజెక్టు వ్యయం రూ.55 వేల కోట్లు అన్నారు. టీఎంసీలు సగానికి సగం తగ్గించారు. తీసుకువచ్చిన రూ.8 లక్షల అప్పులో పోలవరానికి రూ.55 వేల కోట్లు ఖర్చు చేయలేకపోయారు. దాంతో పోలవరం పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.
చంద్రబాబు అయినా, జగన్ అయినా, టీడీపీ అయినా, వైసీపీ అయినా ఇవాళ అందరూ బీజేపీకి బానిసలు అయిపోయారు. వీళ్లు బానిసలు కావడమే కాకుండా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా బీజేపీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు. ఒక్క సీటు లేకపోయినా ఏపీ మొత్తం బీజేపీ వశమైపోయింది. ఇవాళ బీజేపీకి ఇంత మద్దతు ఎందుకు ఇస్తున్నారంటే సమాధానం లేదు.
ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నానన్న చంద్రబాబు… అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా కోసం ఉద్యమించినవారిపై కేసులు పెట్టి జైలుకు పంపారు. జగనన్న గారేమో ప్రతిపక్షంలో ఉన్నన్నాళ్లూ ప్రత్యేక హోదా పాట పాడారు…. ఎన్నో నిరాహార దీక్షలు చేశారు. 25 మంది ఎంపీలతో మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ఎందుకు ఇవ్వరు ప్రత్యేక హోదా? అంటూ ఆ రోజున జగనన్న గారు అన్నారు. తీరా ముఖ్యమంత్రి అయ్యాక జగనన్న గారు ప్రత్యేక హోదా అంశాన్నే పూర్తిగా విస్మరించారు. రాష్ట్రం ఏర్పడ్డాక చంద్రబాబు గెలిచారు, ఇప్పుడు జగనన్న గెలిచారు… ప్రజలు టీడీపీకి ఎమ్మెల్యేలను ఇచ్చారు, వైసీపీకి ఎమ్మెల్యేలను ఇచ్చారు… బీజేపీకి ఒక్క ఎమ్మెల్యేను కూడా ఇవ్వలేదు. అయినా ఇవాళ రాష్ట్రంలో ఎవరు రాజ్యం ఏలుతున్నారు అంటే… బీజేపీనే. ప్రత్యేక హోదా ఇచ్చినా, పోలవరం పూర్తయినా, రాజధాని కట్టినా బీజేపీకి ప్రజలందరూ దండాలు పెట్టేవారు. పదేళ్లలో రాష్ట్రంలో కనీసం లక్ష ఉద్యోగాలు కూడా లేవు. మరి ఎందుకు బీజేపీకి దాసోహం అంటున్నారు? విశాఖ ఉక్కు పరిశ్రమ మన రాష్ట్రానికే తలమానికం. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అవుతుందని 30 వేల మంది ఉద్యోగులు బాధపడుతున్నారు. పక్కనే జింక్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేశారు. అక్కడివాళ్లకు ఉద్యోగాలు పోయాయి.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మేమే ఆపాం అని సజ్జల గారు ప్రెస్ మీట్ పెట్టి చెబుతున్నారు… మీరు అంత భరోసాగా చెబుతుంటే మరి స్టీల్ ప్లాంట్ కార్మికులు మూడేళ్లుగా ఎందుకు ఉద్యమం చేస్తున్నారు? 22 మంది ఎంపీలను ఆంధ్ర ప్రజలు ఇస్తే మూకుమ్మడిగా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం వైసీపీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయడంలేదు? నాడు స్పెషల్ స్టేటస్ కోసం మూకుమ్మడి రాజీనామాలు చేద్దామన్న వైసీపీ వాళ్లు స్టీల్ ప్లాంట్ విషయంలో ఆ మాట ఎందుకు అనడంలేదు? అని షర్మిల మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article