ఫిబ్రవరి 16న ‘భారత్ బంద్’ నిర్వహిస్తున్నట్టు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ ప్రకటించారు. రైతు సంఘాలతోపాటు వ్యాపారులు, రవాణా సంస్థలను కూడా మద్దతు కోరినట్టు తెలిపారు. పంటలకు కనీస మద్దతు ధర సహా అనేక జాతీయ సమస్యలపై ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు రాకేశ్ టికాయత్ తెలిపారు.
ఈ సమ్మెలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సహా పలు రైతు సంఘాలు పాల్గొంటాయని …ఆ రోజున రైతులు తమ పొలాలకు వెళ్లరని తెలిపారు. దేశానికి ఇది పెద్ద సందేశం కావాలని.. బంద్ రోజున వ్యాపారులు కొనుగోళ్లు జరపవద్దని, దుకాణాలు మూసివేయాలని కోరారు. కనీస మద్దతు ధర లేకపోవడం, నిరుద్యోగం, అగ్నివీర్ పథకం, పెన్షన్ పథకం వంటివి దేశానికి సమస్యగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమ్మెలో ఇతర సంఘాలు కూడా పాల్గొనాలని టికాయత్ కోరారు.