అమరావతి:రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే పొత్తులు పెట్టుకున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానాలు చేయొద్దని కోరారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. జన హితానికీ, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికే జనసేన ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్న ఈ దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దన్నారు. పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలు ప్రచారం చేయవద్దని సూచించారు. ఇటువంటి ప్రకటనల వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించినవారవుతారన్నారు. ఇందుకు సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు ఏమైనా ఉంటే తన రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ దృష్టికి తీసుకురావచ్చు.. తద్వారా మీ ఆలోచనలు, భావోద్వేగాలు పార్టీకి చేరుతాయన్నారు. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా ప్రకటనలు చేసే నాయకుల నుంచి వివరణ తీసుకోవలసిందిగా ఇప్పటికే కేంద్ర కార్యాలయానికి స్పష్టత ఇచ్చామని పవన్ తెలిపారు. పొత్తుకు విఘాతం కలిగించాలని ఎవరు ప్రయత్నించినా వారిని ప్రజలు గమనించకమానరు. ప్రజలు స్థిరత్వాన్ని కోరుకుంటున్నారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండడం అవసరం” అని పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.